
క్షేత్రస్థాయిలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై30(క్విక్ టుడే న్యూస్):
అంగన్వాడీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి వారి సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. టీచర్లు, ఆయాలకు కొత్త యూనిఫామ్లను అక్టోబర్ తొలి వారంలోగా అందుబాటులోకి తేవాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 17 దత్తత కేంద్రాలను విస్తరించి ప్రతి జిల్లాలో ఒక అడాప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖాళీ పోస్టుల భర్తీని వేగవంతం చేయడంతో పాటు పిల్లలకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు. కేంద్ర నిధులు ల్యాప్స్ కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.





