ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY: హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. టోక్యో, న్యూయార్క్ వంటి ప్రపంచ ప్రముఖ నగరాలతో పోటీపడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఐఐ నార్తర్న్ రీజినల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన, సురక్షితమైన రాష్ట్రంగా నిలిచిందని సీఎం పేర్కొంటూ, దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. 2047 నాటికి "రైజింగ్ తెలంగాణ" లక్ష్యాన్ని సాకారం చేయడంతో పాటు, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. అలాగే 2037 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విధానపరమైన జాప్యాలకు తావులేదని, ప్రజలకు మేలు చేసే విధానాలను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా వాటిని కొనసాగించే సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటిస్తోందని సీఎం స్పష్టం చేశారు. "క్యూర్–ప్యూర్–రేర్" నమూనాతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డును పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా విస్తరిస్తున్నామని తెలిపారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీకి మచిలీపట్నం వరకు 12 లేన్ల రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు రానున్నాయని తెలిపారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని, ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి వంద శాతం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
అమెజాన్, అదానీ వంటి ప్రముఖ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, ప్రపంచంలోని టాప్-500 కంపెనీలను తెలంగాణకు ఆకర్షించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. "థింక్ గ్లోబల్... ఇన్వెస్ట్ లోకల్" అనే సందేశంతో పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, "తెలంగాణ అంటే వ్యాపారానికి చిరునామా... ఇప్పుడు అది రైజింగ్ తెలంగాణగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది" అని పేర్కొన్నారు.




