తెలంగాణ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఆధునిక రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రసంగించారు. సెప్టెంబర్ 17 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం ప్రజాపాలనకు కీలక ఆధారాలని పేర్కొన్నారు. రైతుకు భరోసా, మహిళలకు ఆర్థిక స్వావలంబన, పేదలకు నాణ్యమైన విద్య–వైద్యం, యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు కుటుంబాలకు మద్దతుగా రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేపట్టామని సీఎం తెలిపారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చామని వివరించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 32 నెలల్లో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చామని, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించామని చెప్పారు. 5.94 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్బుక్లు జారీ చేశామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతుందని, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు రూ.12,385 కోట్ల మేర ప్రయాణ వ్యయం ఆదా అయిందని చెప్పారు. గృహజ్యోతి ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ అందిస్తున్నామని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1.68 లక్షల మంది మహిళలకు రూ.4,709 కోట్ల సహాయం అందించామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ రాయితీలు కల్పిస్తూ మహిళల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్లకు రూ.22,500 కోట్లతో మంజూరు ఇచ్చామని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు.





