సెమీకండక్టర్ రంగానికి అవసరమైన అన్ని చర్యలు.. భారత్లో తయారైన చిప్లు దేశ, విదేశీ మార్కెట్లకు..
సెమికాన్ ఇండియా’ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్17:
ప్రపంచ తయారీ రంగానికి భారత్ను విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమకు భారత్ను ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం ఐదో ‘సెమికాన్ ఇండియా’ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్లో తయారైన చిప్లు తొలిసారిగా దేశీయ, అంతర్జాతీయ వినియోగదారులకు చేరడం ప్రారంభించాయని మోదీ వెల్లడించారు. సెమీకండక్టర్ రంగం విధాన రూపకల్పన దశను దాటి పైలట్ ఉత్పత్తి, వాణిజ్య తయారీ దశకు చేరుకుందని తెలిపారు. మొహాలి, సూరత్లోని ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైందన్నారు.
పరిశోధనపై మరింత దృష్టి
చిప్ డిజైన్, పరికరాలు, ముడి పదార్థాలు, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంచాలని మోదీ సూచించారు. భారతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలతో కంపెనీలు పరిశోధన భాగస్వామ్యాలను విస్తరించాలని కోరారు. విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత కూడా దేశంలో అధునాతన సాంకేతికత అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
రూ.1.275 లక్షల కోట్లతో రెండో దశ
సెమీకండక్టర్ కార్యక్రమం రెండో దశకు ప్రభుత్వం రూ.1.275 లక్షల కోట్ల కేటాయింపును ఆమోదించిందని తెలిపారు. ఫ్యాబ్లెస్ కంపెనీలు, దేశీయ మేధో సంపత్తి, సిలికాన్ ఫోటోనిక్స్తో పాటు సెమీకండక్టర్ పరికరాలు, రసాయనాలు, వాయువులు, ఇతర పదార్థాల తయారీని భారత్లో విస్తరించాలని పరిశ్రమలకు సూచించారు. చిప్ డిజైన్, సంబంధిత రంగాల్లో లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 70 వేల మందికి శిక్షణ పూర్తయిందని చెప్పారు.
12 ప్రాజెక్టులకు అనుమతులు
2021లో ప్రారంభమైన సెమీకండక్టర్ మిషన్ తొలి దశలో సుమారు రూ.76 వేల కోట్లను కేటాయించారు. గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో రూ.1.64 లక్షల కోట్లకు పైగా విలువైన 12 తయారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. మైక్రాన్, కైన్స్, సీజీ సెమీ సంస్థలు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ను 200 బిలియన్ అమెరికన్ డాలర్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరుగుతున్న ‘సెమికాన్ ఇండియా 2026’లో 500కు పైగా సంస్థలు, 40కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.





