యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. నిజామాబాద్లో పట్టపగలే నరికివేత

నిజామాబాద్, సెప్టెంబర్17(క్విక్ టుడే న్యూస్):
నిజామాబాద్ నగరంలో పట్టపగలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గతంలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హరిబాబుపై ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడికి పాల్పడ్డాడు. మరో ఇద్దరు కారులో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హరిబాబు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. గతంలో వైష్ణవి హత్యకు గురైన కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హరిబాబును అరెస్ట్ చేశారు. కొంతకాలం రిమాండ్లో ఉన్న అతడు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణంగానే హరిబాబును ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుల పాత్రపై ఆధారాలు సేకరిస్తూ వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.





