మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (క్విక్ టుడే న్యూస్):
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనానికి దారితీసిన చారిత్రక పరిణామాలను స్మరించుకుంటూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పోలీస్ అమరవీరుల స్మృతి స్థూపం వద్ద నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంగా మారేందుకు అనేక మంది మహనీయులు పోరాటాలు, త్యాగాలు చేశారని ఆయన పేర్కొన్నారు. 1948లో జరిగిన పరిణామాలు దేశ నిర్మాణ చరిత్రలో కీలక ఘట్టమని, ఆ పోరాటాల్లో పాల్గొన్నవారి త్యాగాలను భావితరాలు స్మరించుకోవాలని సూచించారు. హైదరాబాద్ విలీన ప్రక్రియలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని పాటలు, నృత్య రూపకాల ద్వారా ప్రదర్శించగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్, ఎంపీ ఈటల రాజేందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రజాకార్ల దౌర్జన్యాలను చరిత్రలో నమోదు చేయాలి: బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో జరిగిన పోరాటాలు, త్యాగాల చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రజాకార్ల దౌర్జన్యాలు, అప్పటి సామాజిక పరిస్థితులను చరిత్రలో విస్మరించారని ఆయన ఆరోపించారు. నిజాం పాలనను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించడంపై కూడా బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, రావి నారాయణరెడ్డి తదితరులు ఎందుకు పోరాటం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1980 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ కోరుతోందని, కేంద్రం గత కొన్నేళ్లుగా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అధికారికంగా వేడుకలు నిర్వహించే లక్ష్యంతో ముందుకు సాగుతామని అన్నారు.
చరిత్రను భావితరాలకు తెలియజేయాలి: కిషన్రెడ్డి
కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాం పాలనపై అనుకూల వ్యాఖ్యలు చేయడం చారిత్రక పోరాటాలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. తెలంగాణలో వివిధ దశల్లో పోరాడిన వందేమాతరం రాంచందర్రావు, భాగ్యరెడ్డి వర్మ, బండి యాదగిరి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, కొమురం భీమ్ తదితరులను ఆయన ప్రస్తావించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు ఎందుకు ఉద్యమించాయో చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.





