సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
ప్రభుత్వం తరఫున జగన్మాతకు పట్టువస్త్రాలు, బోనం సమర్పణ

హైదరాబాద్, ఆగస్టు2(క్విక్ టుడే న్యూస్):
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల మహోత్సవాలు భక్తుల జయజయధ్వానాల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగజ్జననికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ ధార్మిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకలకు హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసి బందోబస్తును కట్టుదిట్టం చేశారు.





