బీజేపీకి జేడీయూ ఝలక్.. బీహార్లో యూసీసీపై అమలు ప్రసక్తే లేదన్న నితీశ్ పార్టీ

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై బీహార్లో అధికార ఎన్డీయే కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులో యూసీసీకి సంబంధించిన బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం దానిని అమలు చేయబోమని జనతాదళ్ (యునైటెడ్) స్పష్టం చేసింది. జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ మాట్లాడుతూ.. బీహార్లో యూసీసీ అమలుపై తమ పార్టీ వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉందన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ అంశంపై గతంలోనే తమ అభిప్రాయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూసీసీ అమలు చేసే ఆలోచన తమకు లేదని తెలిపారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జేడీయూ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్లో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఈ అంశంపై ఇరు పార్టీల వైఖరులు చర్చకు దారితీశాయి. యూసీసీ విషయంలో తమ పార్టీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని శ్యామ్ రజక్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష ఆర్జేడీ కూడా జేడీయూ వ్యాఖ్యలపై స్పందించింది. బీజేపీ మతపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ విమర్శించారు. బీహార్లో యూసీసీ అమలు ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.





