ఇండోనేషియాలోని జావా సముద్రంలో మునిగిపోయిన ప్యాసింజర్ నౌక
ఆరుగురు మృతి.. మరో 130 మంది గల్లంతు

జకర్తా, సెప్టెంబర్13:
ఇండోనేషియాలో మరో ఘోర నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు, సిబ్బందితో కలిపి 243 మందితో వెళ్తున్న ‘వర్గో ట్రాన్స్పోర్ట్ 8’ అనే ప్యాసింజర్ నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 107 మందిని సురక్షితంగా రక్షించగా.. ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తూర్పు జావాలోని సురబయ నుంచి శనివారం బయలుదేరిన నౌక.. దక్షిణ కాలిమంటన్లోని బంజర్మాసిన్ వైపు ప్రయాణిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నౌక కెప్టెన్ నుంచి అధికారులకు చివరి సమాచారం అందింది. సముద్రంలో దాదాపు మూడు మీటర్ల ఎత్తున భారీ అలలు ఎగసిపడుతున్నాయని, వాటి ధాటికి నౌక ఒకవైపునకు ఒరిగిపోతోందని కెప్టెన్ సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ సందేశం అందిన కొద్దిసేపటికే నౌకతో సంబంధాలు తెగిపోయాయి. బంజర్మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. భారీ అలల కారణంగానే నౌక అదుపుతప్పి బోల్తా పడి సముద్రంలో మునిగిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నౌకాదళానికి చెందిన ఓ నౌకతో పాటు మరో మూడు నౌకలు, హెలికాప్టర్, సమీప ప్రాంతాల్లోని టగ్బోట్లను రంగంలోకి దించారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే రక్షించిన 107 మందిని సమీపంలోని తూర్పు జావా పోర్టుకు తరలించి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కూడా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంజర్మాసిన్లోని త్రిశక్తి పోర్టు వద్ద గల్లంతైన ప్రయాణికుల బంధువులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయాణికుల జాబితాలను పరిశీలిస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారి గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దీంతో పోర్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేలాది ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో సముద్ర రవాణా అత్యంత కీలకం. అనేక ప్రాంతాల మధ్య ప్రయాణానికి ప్రజలు ఫెర్రీలు, ప్యాసింజర్ నౌకలపైనే ఆధారపడుతున్నారు. అయితే భద్రతా ప్రమాణాల లోపం, ప్రతికూల వాతావరణం కారణంగా దేశంలో తరచూ నౌకా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదంలోనూ ప్రయాణికుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా నమోదైన ప్రయాణికుల సంఖ్యకు, వాస్తవంగా నౌకలో ఉన్న వారి సంఖ్యకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో గల్లంతైన వారి ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం సహాయక చర్యలకు సవాలుగా మారింది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య మరింత మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.





