కాగ్నిజెంట్కు పెర్మ్ ఫైలింగ్స్ నిలిపివేత.. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలపై దృష్టి
కాగ్నిజెంట్, క్లౌడెరాపై దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9:
మోసాలు, అక్రమాలపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్కార్డు ప్రక్రియలో కీలకమైన శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ (PERM) ఫైలింగ్స్ను నిలిపివేసినట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. కాగ్నిజెంట్తో పాటు క్లౌడెరా సంస్థకు సంబంధించిన PERM ప్రక్రియను కూడా సస్పెండ్ చేసినట్లు కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించారు. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. వైట్హౌస్ ఫ్రాడ్ టాస్క్ఫోర్స్తో పాటు ఇతర ఉన్నతాధికారుల సమన్వయంతో రెండు సంస్థలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఫైలింగ్స్కు సంబంధించిన వాస్తవాలు, మోసం జరిగిందా?, ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్కార్డు పొందే ప్రక్రియలో PERM కీలక దశ. ఒక విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు, ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని యాజమాన్యం నిరూపించాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ఉద్యోగి నియామకం వల్ల అమెరికా కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని నిర్ధారించాలి. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో పలువురు గ్రీన్కార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. కంపెనీలు వారి తరఫున PERM ప్రక్రియను చేపడతాయి. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ ఫైలింగ్స్ నిలిపివేత ఇప్పటికే గ్రీన్కార్డు ప్రక్రియలో ఉన్న విదేశీ ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది పరిణామాలు ఎలా ఉంటాయనేది స్పష్టత రావాల్సి ఉంది. వీసా, ఉపాధి కార్యక్రమాల్లో మోసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.





