
అప్పట్లో సిరిసిల్ల.. ఇప్పుడు కొడంగల్: అసెంబ్లీలో సీఎం రేవంత్పై బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ చూపించడంలో సీఎం రేవంత్ రెడ్డి తమకు ఆదర్శం అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తన నియోజకవర్గానికి ఏకంగా రూ. 2900 కోట్లు తీసుకువెళ్లారని, మరి తమ ప్రాంతాలపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
గతంలో నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే వెళ్తున్నాయని విమర్శలు ఉండేవని, ఇప్పుడు కూడా కేవలం కొడంగల్, మధిర, ములుగు ప్రాంతాలకే నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. వివక్షకు గురవుతున్నామనే కారణంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఇప్పుడు మళ్లీ అదే వివక్ష పునరావృతం కావడం దారుణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు.





