కేసీఆర్ ఫామ్హౌస్లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి.. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా భూముల బదలాయింపుల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్కు చెందిన ఎర్రవల్లి ఫామ్హౌస్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేసీఆర్కు ఎర్రవల్లిలో సుమారు 700 ఎకరాల ఫామ్హౌస్ ఉందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారణ అయితే, దానిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేస్తామని సభా వేదికగా స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలను కూడా రేవంత్రెడ్డి సభలో ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తొమ్మిది జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 439 ఎకరాల భూమి ఉన్నట్లు సీఎం వెల్లడించారు.
అలాగే జోగినపల్లి సంతోష్కుమార్ కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్రావుకు 52 ఎకరాలు, కొండల్రావుకు 48 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ జన్వాడ ఫామ్హౌస్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఎలాంటి బాంబులు వేయలేదని, ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శలను సీఎం వ్యంగ్యంగా ప్రస్తావించారు. శాసనసభలో ధరణి వ్యవస్థపై జరిగిన చర్చలో రేవంత్రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. నీటి ప్రాజెక్టుల అనంతరం అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టి భూములపై పడిందని, భూముల వివరాలను ఒక ప్రైవేట్ వ్యవస్థ చేతుల్లోకి వెళ్లేలా చేశారని ఆరోపించారు. తెలంగాణలోని సుమారు 2.5 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ధరణి రూపకల్పనలో కేసీఆర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కీలకంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. రెవెన్యూ సమాచారాన్ని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ)కి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అప్పగించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రూ.110 కోట్ల విలువైన కాంట్రాక్టు రూ.1,400 కోట్ల స్థాయికి ఎలా చేరిందనే అంశంపైనా విచారణ అవసరమని అన్నారు.





