తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులను ఆకట్టుకున్న చిన్నశేష వాహనసేవ

తిరుమల, సెప్టెంబర్ 16 (క్విక్ టుడే న్యూస్):
తిరుమల కొండపై శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు చిన్నశేష వాహనసేవ కన్నులపండువగా నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామివారు దేవేరులతో కలిసి ఐదు తలల చిన్నశేష వాహనంపై పాండురంగస్వామి అలంకారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు ‘గోవింద’ నామస్మరణతో మార్మోగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో ఆయన 15వసారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. వాహనసేవకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, సంగీతం, కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులను అలరించారు. మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందాల నుంచి 539 మంది కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్కు చెందిన కళాకారులు తమ ప్రాంతీయ కళా వైభవాన్ని తిరుమలలో ఆవిష్కరించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ నిర్వహించనున్నారు.





